
- పెద్దశంకరంపేటలో స్కూళ్లు, పీహెచ్సీ తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్
- విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్
మెదక్ టౌన్, పెద్దశంకరంపేట, వెలుగు : మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు శాతం పెరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ మేరకు గురువారం పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి కూర్చొని పాఠాలను విన్న కలెక్టర్ అనంతరం తాను టీచర్గా మారి విద్యార్థులకు మ్యాథ్స్ పాఠాలు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
మంచి భోజనంతో పాటు నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలతోనే సాధ్యమన్నారు. అనంతరం పెద్దశంకరంపేట పీహెచ్సీని కలెక్టర్ పరిశీలించారు. సెలవు రోజుల్లో కూడా డాక్టర్లు , సిబ్బంది ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. పీహెచ్సీలోని హాజరు పట్టికను పరిశీలించారు. ప్రతి రోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారు.. మందులు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు రాకుండా దృష్టి సారించాలని తెలిపారు. కలెక్టర్ వెంట విద్యాశాఖ అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.